● బాలల పరిరక్షణ అధికారి ఓంకార్
ములుగు: బాలల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగు, గోవిందరావుపేట, వెంకటాపురం(ఎం) మండలాల్లోని బాలసదనం చిన్నారులకు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని తెలిపారు. పిల్లలకు వార్షిక వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల ఆరోగ్య సమస్యలు గుర్తించేందుకు వీలుంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, బాలసదనం సూపరింటెండెంట్ కావ్య తదితరులు పాల్గొన్నారు.


