ఉన్నట్టా.. లేనట్టా..
నామమాత్రంగా యూత్ ట్రైనింగ్ సెంటర్లు
ఏటూరునాగారం: గిరిజన యువతీయువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి యూత్ ట్రైనింగ్ సెంటర్లను (వైటీసీ) నెలకొల్పారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో ఏటూరునాగారం, జాకారం, కాటారం ప్రాంతాల్లో నెలకొల్పి దాని ద్వారా గిరిజన యువతీ యువకులకు పలు రకాల శిక్షణలను ఉచితంగా ఇచ్చేవారు. అందులో శిక్షణ పొందిన వారికి ఉపాధి కూడా కల్పించేలా ఐటీడీఏ ప్రత్యేక చర్యలు చేపట్టేది. కానీ ఉపాధి శిక్షణలు, అవకాశాలు లేకుండా పోయాయి. వైటీసీ కేంద్రాలు కేవలం వరదలప్పుడు వచ్చే ఎన్డీఆర్ఎఫ్, ఇతర అవసరాలకు షెల్టర్లుగా మారాయి. తరగతి గదులు బోసిపోయి కనిపిస్తున్నాయి.
ప్రైవేట్రంగంతో భాగస్వామ్యం
వైటీసీ సెంటర్లలో నేరుగా ప్రభుత్వం శిక్షణ ఇవ్వకుండా ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఏజెన్సీలను వారికి వసతి, భోజనం, ఇతర ఖర్చులను అందజేసేందుకు బడ్జెట్ కేటాయించేవారు. గతంలో సింక్రోసర్వ్ అనే ఏజెన్సీలో ఐటీడీఏ భాగస్వామ్యం చేసుకొని హోటల్ మేనేజ్మెంట్, సోలార్ సిస్టమ్పై శిక్షణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటివి ఏమిలేకుండా నిరుపయోగంగా భవనాలు మిగిలిపోతున్నాయి. దీంతో చదువుకున్న గిరిజన యువతీ యువకులు ఎలాంటి ఉపాధి లభించక నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది.
పలు పథకాలు నిర్వీర్యం
ఉపాధి శిక్షణ కింద భవిత, స్వయం ఉపాధి ట్రైనింగ్, ఉద్యోగ ఉపాధి అనే నాలుగు అంశాలపై యువతను సన్మార్గంలో పెట్టేలా గత ప్రభుత్వాలు రూపకల్పన చేశాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాలపై ఎలాంటి మొగ్గు చూపడం లేదు. ఐటీడీఏ కార్యాలయానికి సరైన బడ్జెట్ను కేటాయించకపోవడంతో ఉపాధి శిక్షణ కార్యక్రమాలను చేపట్టడం లేదని అధికారులు పెదవి విరుస్తున్నారు. కేవలం వేతనాలు, మెంటనెన్స్ కింద మాత్రమే నిధులొస్తున్నాయని, ఇతర ఉపాధి కార్యక్రమాలకు రావడం లేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి దృష్టి సారించడం లేదు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద వచ్చే నిధులు సైతం పక్కదారి పటిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీంతో గతంలో ఏర్పాటు చేసిన ఉపాధి లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి.
జిల్లాలో 2,119 మంది నిరుద్యోగులు
జిల్లాలోని 9 మండలాల్లో గిరిజన నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారని గతంలో సర్వే చేపట్టారు. ఆ సర్వే ఆధారంగా జిల్లాలో సుమారు 2,119 మంది గిరిజనులున్నారు. వారికి సరైన ఉపాధి, శిక్షణ ఇవ్వాల్సిన ఐటీడీఏ చూస్తూ ఉండడం గమనార్హం. శిక్షణ, ఉపాధి లేకపోవడంతో యువత చెడుమార్గం, వ్యసనాలకు దారి తీస్తోందని వారి తల్లిదండ్రులు, ఆదివాసీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.
●
గిరిజనులకు దక్కని శిక్షణ, ఉపాధి
నిధులు లేమి కారణంగా
జాబ్మేళాలు శూన్యం
జిల్లాలో 2,119 మంది
గిరిజన నిరుద్యోగులు


