మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'వసుదేవసుతం'. ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెయిన్బో సినిమాస్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తుంటే ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ ఈ కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆలయంలోని బ్రహ్మ పదార్థం కోసం శత్రు మూకలు చేసే విన్యాసాన్ని అడ్డుకునే పాత్రలో హీరో మహేంద్రన్ అదరగొట్టేశారు. యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆయుధం వస్తోంది.. దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు.. అనే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తోంది. ట్రైలర్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు.
మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ .. 'వసుదేవసుతం’ కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. కథ నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. దర్శకుడు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఈ మూవీని పూర్తి చేశారు. కృష్ణుడి మీద తీసిన ఈ కంటెంట్ జనాలకు నచ్చాలని బాగా తెరకెక్కించారు. ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇలాంటి ఓ పాత్ర, సినిమా దొరకడం నా అదృష్టం. నిర్మాత మీదున్న నమ్మకంతోనే అడ్వాన్స్లాంటివి అడగలేదు. ఏ నటుడి నుంచి ఎంత రాబట్టుకోవాలనేది దర్శకుడు వైకుంఠ్కి చాలా బాగా తెలుసు. అంబికా వాణి చక్కగా నటించారు. జూలై 10న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో మా సినిమాని చూసి ఆశీర్వదించండి' అని అన్నారు.
దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ .. 'నిర్మాతకు ముందు ఓ రెండు కథలు చెప్పా. మళ్లీ ఒరిస్సాలోని ఫేమస్ టెంపుల్ బ్యాక్ డ్రాప్లో ఓ కథను రాసుకున్నా. ఆ కథ చెప్తే.. అంతకు ముందు చెప్పిన వాటిని పక్కన పెట్టేయండని నిర్మాత అన్నారు. మహేంద్రన్కు కథ చెప్పిన వెంటనే ఓకే. మణిశర్మ గారికి కథ చెప్పా. నచ్చితేనే చేయండని ఆయనతో అన్నా. కథ నచ్చడంతో వెంటనే పని ప్రారంభించారు. మూవీ చూసిన తర్వాత మణిశర్మ పాటలు, ఆర్ఆర్ గురించి కచ్చితంగా మాట్లాడతారు. డైలాగ్స్ బాగుంటాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. నా మూవీ ఎవ్వరినీ నిరాశపర్చదు. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ కీలక పాత్రల్లో నటించారు.


