క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే? | Tollywood Anchor Sreemukhi Apologise to Her Comments In Event | Sakshi
Sakshi News home page

Sreemukhi: పెద్ద మనసుతో క్షమిస్తారని వేడుకుంటున్నా: శ్రీముఖి వీడియో రిలీజ్

Jan 8 2025 7:11 PM | Updated on Jan 8 2025 8:54 PM

Tollywood Anchor Sreemukhi Apologise to Her Comments In Event

టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) క్షమాపణలు చెప్పారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్‌లో చేసిన కామెంట్స్‌పై సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన శ్రీముఖి నిర్మాత దిల్‌ రాజు, శిరీష్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలోనే రామ, లక్ష్మణుల పేర్లను కూడా ప్రస్తావించింది. దీంతో అది కాస్తా వివాదానికి దారితీసింది.

అసలేం జరిగిందంటే..

'నిర్మాతలు దిల్ రాజు(dil raju), శిరీష్‌ను పొగిడే క్రమంలో.. రామ, లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్(ఊహజనిత పాత్రలు) అని మనం విన్నాం.. కానీ సాక్షాత్తూ ఇప్పుడు నా కళ్లముందే కూర్చున్నారు.. వారిలో ఒకరు దిల్ రాజు అయితే.. మరొకరు శిరీష్ గారు అంటూ ప్రశంసలు కురిపించింది'.

రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్‌ అనడంతో శ్రీముఖి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‍అసలు నీకు రామాయణం తెలుసా? అని చాలామంది ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే శ్రీముఖి క్షమాపణలు కోరుతూ వీడియోను రిలీజ్ చేసింది.

వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ..' రీసెంట్ టైమ్స్‌లో నేను హోస్ట్ చేసిన ఓ ఈవెంట్‌లో పొరపాటున రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం జరిగింది. నేను ఒక హిందువునే.. నేను దైవ భక్తురాలినే.. అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంతగా జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే మీ అందరికీ క్షమాపణ కోరుతున్నా. దయచేసి మీరంతా పెద్ద మనసుతో నన్న క్షమిస్తారని వేడుకుంటున్నా.. జై శ్రీరామ్' అంటూ మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

పొంగల్ బరిలో సంక్రాంతికి వస్తున్నాం..

వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా   రాజేష్‌ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేసి, చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. అలాగే ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని నిజామాబాద్‌లో నిర్వహించారు. 

72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. 

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి మాత్ర కేవలం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’((Sankranthiki Vasthunnam Movie) జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్‌ మాత్రమే వృథా అయిందట.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అనౌన్స్‌ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్‌ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్‌ సమయంలోనే ఎడిటింగ్‌ చేసేశాం. ఫలానా సీన్‌ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్‌కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్‌ చేయాల్సి వచ్చింది.  ఈ మూవీకి ఎంత బడ్జెట్‌ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అన్నారు. 
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement