ప్రతివారం ఓ బాహుబలి రాదు

Sunitha Tati Speech at Saakini Daakini Press meet - Sakshi

‘‘నా దృష్టిలో కథ అనేది ఓ ప్రయాణం. కానీ కొన్ని పరిమితుల కారణంగా కథారచయితలకు మనం ఎక్కువగా ఫ్రీడమ్‌ ఇవ్వడం లేదని నాకనిపిస్తుంటుంది. అందుకే ఎక్కువగా కొరియన్‌ సినిమాలను రీమేక్‌ చేస్తున్నాం. అయినా కథలో సోల్‌ను తీసుకుని, మన నేటివిటికీ తగ్గట్లుగా మార్పులు చేయడం అనేది సులువైన పనేం కాదు. ‘శాకిని డాకిని’ సినిమాకు అక్షయ్‌ అనే కుర్రాడు స్క్రీన్‌ప్లే అందించాడు’’ అన్నారు సునీత తాటి.

రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సౌత్‌ కొరియన్‌ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు, సునీత తాటి, హ్యూన్యు థామస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఓ క్రైమ్‌ను ఎలా డీల్‌ చేశారు? అన్నదే ఈ సినిమా కథ. ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ చిత్రంలో హీరోలు నటించారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్స్‌ను పెట్టాం.

ఇక మన దగ్గర కాస్త కథల కొరత ఉందని నా ఫీలింగ్‌. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిన రాజమౌళిగారు ఉన్నారు. కానీ ప్రతి వారం ‘బాహుబలి’ లాంటి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే సినిమాలు థియేటర్స్‌కు రావు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రీమేక్‌ రైట్స్‌ కావాలని కొందరు ఫిల్మ్‌మేకర్స్‌ నన్ను సంప్రదించారు. ఈ విషయాన్ని రాజమౌళిగారి దృష్టికి తీసుకుని వెళ్లాను’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రంలో దామిని అనే పాత్ర పోషించాను. ఈ సినిమా నా కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రెజీనా. ‘‘ఈ చిత్రంలో షాలిని పాత్ర చేశాను. ఈ సినిమా చూసేందుకు థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల టికెట్‌ డబ్బులు వృథా కావనే నమ్మకం మాకుంది’’ అన్నారు నివేదా థామస్‌.

చదవండి: (నన్నీ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top