రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న జైలర్-2 సెట్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో సిబ్బంది మృతి చెందారు. చెన్నైలోని పనైయూర్లో ఉన్న ఒక ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో ఈ ఘటన జరిగింది. మృతున్ని చిత్రబృందంలో పనిచేస్తోన్న కార్తికేయన్గా గుర్తించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం కార్తికేయన్ ఆర్ట్ డైరెక్షన్ యూనిట్లో పనిచేస్తున్నారు. తన పనిలో భాగంగా షూటింగ్ కోసం ఇంటి సెట్ను నిర్మించడంలో సహాయం చేస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో యువకుడు అక్కడిక్కడే మరణించాడు. పనైయూర్లోని స్టూడియోలో ఈ సంఘటన జరిగిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. విద్యుత్ లీక్కు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.
కాగా.. ఇటీవలే 'జైలర్ 2' షూటింగ్ పూర్తయిందని సన్ పిక్చర్స్ ప్రకటించిన కొన్ని వారాల తర్వాతే ఈ సంఘటన జరిగింది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023లో వచ్చిన జైలర్కు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని జూన్ 12న విడుదల అవుతుందని మొదట ప్రకటించినప్పటికీ... సన్ పిక్చర్స్ ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని కృష్ణాష్టమి కానుకగా సెప్టెంబర్ 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణన్, యోగి బాబు, మీర్నా కీలక పాత్రల్లో నటించారు.


