పునీత్‌ రాజ్‌ కుమార్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌.. అప్పుకు అంకితంగా

Puneeth Raj Kumar Wife Ashwini Emotional Post - Sakshi

Puneeth Raj Kumar Wife Ashwini Emotional Post: కన్నడ పవర్‌ స్టార్‌, దివంగత పునీత్‌ రాజ్‌ కుమార్‌ భార్య అశ్విని తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ఇప్పటివరకు యాక్టివ్‌గా ఉండని ఆమె అకౌంట్‌ ఓపెన్‌ చేసి మరీ మొదటి పోస్టును పునీత్‌ రాజ్ కుమార్‌కు అంకితమిచ్చారు. ఆమె ఆ పోస్టులో 'శ్రీ పునీత్‌ రాజ్‌ కుమార్‌ అకాల మరణం మా కుటుంబ సభ్యులకే కాదు, మొత్తం కర్ణాటక ప్రజలకు షాకింగ్‌గా ఉంది. ఆయన్ను 'పవర్ స్టార్‌' చేసిన అభిమానులకు పునీత్‌ లేని లోటు ఊహించడం కష్టమే. ఈ బాధలో మీరు మనోనిబ‍్బరం కోల్పోకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా, గౌరవంగా పునీత్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. సినీ ప్రియులు మాత్రమే కాకుండా ఇండియాతో పాటు విదేశాల నుంచి ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు. అప్పు (పునీత్‌ రాజ్‌ కుమార్‌)ని వేలాది మంది ఫాలో అవ్వడం, ఆయనలా నేత్రదానానికి ముందుకు రావడం, మీ మనసులో అప్పుకు ఉన్న స్థానం చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన‍్ను ఆదర్శంగా తీసుకొని మీరు చేసే మంచి పనుల్లో పునీత్‌ జీవించే ఉంటారు. మీ ప్రేమ, మద్దతు కోసం మా మొత్తం కుటుంబం తరఫున అభిమానులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.' అంటూ అశ్విని కృతజ్ఞతలు తెలిపారు. 

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ గత నెల 29న గుండెపోటుతో మరణించారు. పునీత్‌ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అది తట్టుకోలేని 21 మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఆయన సినిమాలకంటే కూడా పునీత్‌ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. 46 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించి అభిమానులతో పాటు యావత్‌ సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు పునీత్‌. వేలాది మంది అభిమానులు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు. నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు. ఆయన మరణించి 20 రోజులు అవుతున్నా కర్ణాటకలో ఇప్పటికీ ఆయన పేరే వినిపిస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top