ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ..‘ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది ఈ చిత్ర కథాంశం. హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఆమెది లీడ్ రోల్. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో, వ్యాపారం కోసం ఎవరు వచ్చారో ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆ జర్నలిస్టు చేసిన హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు, రాజకీయ నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు సమాజంలో ఉండకూడదు అనుకుంటారు చాలామంది. ఇలాంటి మంచి జర్నలిస్టు కొందరు చేసిన రాజకీయాలకు రోడ్డున పడే పరిస్థితి వస్తే ఒక మంచి ముఖ్యమంత్రి ఆమెకు హెల్ప్ చేస్తాడు. ఇలాంటి అమ్మాయి జర్నలిజంలో ఉండాలని అండగా నిలబడతాడు. ఆ సీఎం పాత్రలో ఎంపీ రఘునందన్ రావు నటించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా.
ఈ సినిమాకు పాలిటిక్స్ కు ఎలాంటి సంబంధం లేదు. వందశాతం సిన్సియర్ గా చేసిన సినిమా ఇది. ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ స్క్రీన్ ప్లే..ఇండియాలోనే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను. నా కెరీర్ లో కూడా ఇది బెస్ట్ స్క్రీన్ ప్లేగా పేరు తెచ్చుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ సినిమా ప్రజలకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. అన్ని వర్గాల ప్రేక్షకులు భయం లేకుండా ఈ సినిమాను చూడొచ్చు’ అన్నారు.


