డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్పై కేసు నమోదైంది. ఆయనపై జానీ మాస్టర్ సతీమణి సుమలత దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రఘు మాస్టర్ కార్యవర్గం చెల్లదంటూ ఆమె ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్కు పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మరింత తెలియాల్సి ఉంది.
అసోసియేషన్ అధ్యక్షురాలిగా తొలగింపు..
కాగా.. గతేడాది డిసెంబరులో జానీ మాస్టర్ భార్య సుమలత.. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. వచ్చే ఏడాది డిసెంబరు వరకు పదవీకాలం ఉంది. కానీ అసోసియేషన్లో గత కొన్నాళ్ల నుంచి జరుగుతున్న సంఘటనల కారణంగా ఈమెని తప్పించారు. హైదరాబాద్లోని కృష్ణానగర్లో యూనియన్ డ్యాన్సర్స్ భేటీ అయ్యారు. ఈ మేరకు కార్యవర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులని ప్రకటించారు.
డ్యాన్సర్స్ అసోసియేషన్కి రఘు మాస్టర్ ప్రెసిడెంట్ కాగా.. మెహర్ బాబా మాస్టర్ సెక్రటరీ, బసవరాజు వైస్ ప్రెసిడెంట్, రాజన్న జాయింట్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. కార్యవర్గ సభ్యులుగా సతీష్, నాగార్జున, శివ కృష్ణ , జోజో ఉండనున్నారు. అయితే వీళ్లంతా తాత్కాలిక సభ్యులే. త్వరలో ఎన్నికలు జరుగుతాయని రఘు మాస్టర్ చెప్పారు.


