‘‘శివ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ప్రేమతో వచ్చిన మీ అందరికీ (ఫ్యాన్స్) ధన్యవాదాలు. ఈ సినిమాని మీ తల్లిదండ్రులు థియేటర్స్లో చూసుంటారు. ఇప్పుడు అదే ప్రేమతో మీరూ వచ్చారు. 36 ఏళ్ల క్రితం నాతో ‘శివ’ సినిమా తీసి, నన్ను పెద్ద స్టార్ని చేసిన నా మిత్రుడు రామ్గోపాల్ వర్మకి థ్యాంక్స్. మంగళవారం ఉదయం ‘శివ’ చూశాను. అద్భుతంగా అనిపించింది’’ అన్నారు నాగార్జున. రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, అమల జోడీగా నటించిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలైంది.
అన్నపూర్ణ స్టూడి యోస్ 50 ఏళ్ల సందర్భంగా సరికొత్త 4కె డాల్బీ అట్మాస్లో ఈ నెల 14న ‘శివ’ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానుల సమక్షంలో రీ రిలీజ్ ట్రైలర్ని లాంచ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘దాదాపు 6 నెలల పాటు రాము చాలా ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్ని మళ్లీ ఒరిజినల్ సినిమా చేసినట్టుగా అద్భుతంగా డిజైన్ చేశాడు. శివ ఈజ్ ఫరెవర్.
మరో 36 ఏళ్ల తర్వాత కూడా ‘శివ’ని మళ్లీ మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ‘శివ’కి ముందు ‘శివ’కి తర్వాత అని రాజమౌళిగారు అన్నట్టు ‘శివ’ ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని చెప్పారు. 36 ఏళ్ల తర్వాత మేమిద్దరం (నాగార్జున, వర్మ) ఒకే వేదికపై ఇలా మీ ముందు రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేస్తూ మాట్లాడతామని ఎప్పుడూ ఊహించలేదు. ఇది చాలా గొప్ప అనుభూతి. రీ రిలీజ్ కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగించాం. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చిరంజీవిగారు చెప్పినట్టు సినిమా ఉన్నంత వరకు ‘శివ’ చిరంజీవిలా చిరస్మరణీయం’’ అని రామ్గోపాల్ వర్మ పేర్కొన్నారు.


