
టాలీవుడ్ నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'ఎంఫోర్ఎం' (Motive for Murder). తాజాగా ఈ చిత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన అవకాశం దక్కించుకుంది. మే 17న సాయంత్రం 6:00 గంటలకు కేన్స్లోని పలాయిస్ థియేటర్లో ప్రైవేట్ స్క్రీనింగ్ చేయనున్నారు. గొప్ప నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడ్లపట్ల ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు.
ప్రముఖ అమెరికన్ నటి జో శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. విడుదలకు ముందే ఈ సినిమా అనేక అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకుంది. ఇటీవలి కాలంలో జో శర్మ ప్రతిష్టాత్మక వేవ్స్ ఈవెంట్లో సందడి చేశారు. ఈవెంట్లో అమెరికన్ డెలిగేట్ నటిగా పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటు అత్యంత గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంఫోర్ఎం టీమ్ ముంబయిలోని థియేటర్లో ప్రెస్ మీట్ నిర్వహించింది.
మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ..'మా సినిమాను కేన్స్లో ప్రదర్శించడమన్నది ఒక గొప్ప అవకాశం, ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. మా టీమ్ అంతా చాలా ఉత్సాహంగా, ఆహ్లాదంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం' అని తెలిపారు.
ఈ సినిమా హత్యా కథాంశం ఆధారంగా రూపొందిన ఉత్కంఠభరిత థ్రిల్లర్గా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇకపోతే, హంతకుడెవరో ఊహించిన వారికి ఒక లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. మోహన్ వడ్లపట్ల టాలీవుడ్లో మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో లాంటి చిత్రాలను నిర్మించారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు.