కథ కొత్తగా ఉంటేనే చేస్తాను – జేడీ చక్రవర్తి | JD Chakravarthy Talks about his role in Gayapadda Simham | Sakshi
Sakshi News home page

కథ కొత్తగా ఉంటేనే చేస్తాను – జేడీ చక్రవర్తి

Apr 24 2026 5:43 AM | Updated on Apr 24 2026 5:43 AM

JD Chakravarthy Talks about his role in Gayapadda Simham

‘‘కథ వర్కౌట్‌ కాకపోతే క్యారెక్టర్స్‌ నిలవవు. ఒకవేళ నిలిచినా సినిమా ఆడదు. కథ వర్కౌట్‌ అయితేనే సినిమా ఆడుతుంది. ‘శివ’లో నా క్యారెక్టర్‌ నా పేరుగా మారిపోయింది. చక్రవర్తి అంటే గుర్తుపట్టరు, జేడీ చక్రవర్తి అంటేనే గుర్తుపడతారు. అలాగే భవాని, సత్య, కల్లు మామ... ఇలా చాలా పాత్రలు ఆడియన్స్‌కు గుర్తుండిపోయాయి. ‘వైఫ్‌ ఆఫ్‌ వి. వరప్రసాద్‌’ సినిమాలో నేను చేసిన త్యాగరాజు పాత్ర నా ఫేవరెట్‌ క్యారెక్టర్‌.

 ఈ పాత్ర వర్కౌట్‌ అయ్యింది కానీ సినిమా మాత్రం ఆడలేదు. నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం. అందుకే ప్రయోగాత్మక సినిమాలు, పాత్రలు చేస్తుండటం ఆపను. హీరో, విలన్‌... ఇలా బేరీజు వేసుకోను. కాకపోతే కథ కొత్తగా ఉంటేనే చేయాలనిపిస్తుంది’’ అని జేడీ చక్రవర్తి అన్నారు. తరుణ్‌ భాస్కర్‌ హీరోగా కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించగా, జేడీ చక్రవర్తి ఓ కీలక పాత్రలో నటించారు.

 పవన్‌ సాధినేని సమర్పణలో కల్యాణ చక్రవర్తి మంధని, భాను కిరణ్‌ ప్రతాప, విజయ్‌ కృష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సల్‌ నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నేను బ్రూటర్‌ ధర్మ అనే పాత్ర చేశాను. కానీ స్క్రీన్‌పై నేను చేసే పనులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. దర్శకుడు కశ్యప్‌ నా పాత్రను కొత్తగా ప్రజెంట్‌ చేశాడు. ఫస్ట్‌ హాఫ్‌–సెకండ్‌ హాఫ్‌.. రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్‌లో కనిపించే ధర్మ పాత్ర నన్ను ఎగ్జైట్‌ చేసింది’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement