
బలగం చిత్రంతోనే తనకు మంచి గుర్తింపు లభించిందని సినీ నటుడు సంజయ్కృష్ణ అన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 2013లో మొదటగా కాళీచరణ్ చిత్రంలో నటించానన్నారు. బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ, జయసింహా, భగవంత్ కేసరి, చిరంజీవి నటించిన ఆచార్య, పవన్ కల్యాణ్ నటించిన బీమ్లానాయక్, కాటమరాయుడు చిత్రాలు మంచి పేరు తెచ్చాయన్నారు. ఇప్పటి వరకు 53 చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించానన్నారు.
ప్రస్తుతం నితిన్ హీరోగా ఓ చిత్రంతో పాటు ఎనిమిది నూతన చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభతో పాటు మంచి పాత్రలు దొరికితేనే గుర్తింపు లభిస్తుందన్నారు. ఆయనను గుర్తించిన అభిమానులు ఫొటోలు తీసుకుంటూ అభిమానం చాటుకున్నారు.