తెలుగు బిగ్బాస్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రతి ఏడాది సెప్టెంబరు-డిసెంబరు మధ్య కాలంలో జరుగుతూ ఉంటుంది. గతేడాది కామనర్ కల్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. అంతకు ముందు సీజన్లలో నిఖిల్, పల్లవి ప్రశాంత్ తదితరులు విన్నర్స్ అయ్యారు. గెలిచిన వాళ్లు ఏమైనా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారా అంటే అంత సీన్ లేదు. ఇప్పుడు అదే విషయమై మాట్లాడుతూ ఏడో సీజన్ రన్నరప్ అమర్దీప్ కుండబద్దలు కొట్టేశాడు. బిగ్బాస్ ఓట్లు దేనికి పనికిరావు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
(ఇదీ చదవండి: ట్రెండింగ్లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)
'బిగ్బాస్లో ఓట్లు వేశారు కదా, వాళ్లంతా థియేటర్కి వచ్చేస్తారని మనం సినిమాలు చేయకూడదు. నువ్వు ఏం చేయగలవో ప్రూవ్ చేసి ప్రేక్షకులని రప్పించుకోవాలి. అంతే గానీ ఆ ఓట్లు దీనికి పనికిరావు. ఆ షోలో గెలిచినా, టాప్-5లో ఉన్నా గానీ అదంతా ఒక్కరోజుకే. తర్వాత నుంచి అంతా సాధారణమే. ఈవెంట్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, స్టేజీ షోలు చేసుకోవడమే. అక్కడ వచ్చిన పేరు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఆలస్యమవ్వొచ్చు కానీ సక్సెస్ అయితే దొరుకుతుంది'
'బిగ్బాస్లో చేసిన వాళ్లందరూ హీరోలు అయ్యింటే ఈ పాటికి పెద్ద లిస్ట్ అయ్యేది. ఈ షో అనేది వన్డే కింగ్. బయటకొచ్చిన తర్వాత ఎవడి జీవితం వాడిది. మన వ్యక్తిత్వం, అలవాట్లు, మాటలు చూసి కాసేపు రిలాక్స్ కోసం జనాలు మాట్లాడుకుని ఓట్లేస్తారు' అని అమర్దీప్ చెప్పుకొచ్చాడు. ఇతడు మాట్లాడిన దానిబట్టి చూస్తే సొహెల్కి పరోక్షంగా కౌంటర్ వేశాడా అని సందేహం వస్తుంది. ఎందుకంటే బిగ్బాస్ నుంచి బయటకొచ్చిన కొన్ని సినిమాలు చేసిన సొహెల్.. ఓ మూవీ రిలీజ్ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నాడు. షోలు ఓట్లు వేశారు కదన్నా, సినిమాకు ఎందుకు రావట్లేదు అని అడిగాడు. ఇతడే కాదు సన్నీ తదితరులు కూడా హీరోగా ఒకటి రెండు మూవీస్ చేసి పూర్తిగా కనుమరుగైపోయారు. కాబట్టి బిగ్బాస్ ఫేమ్ అనేది నీటిపై బుడగ లాంటిదే. ఎప్పుడు పేలిపోతుందే చెప్పలేం!
(ఇదీ చదవండి: #AA23.. సీక్రెట్ చెప్పేసిన లోకేశ్ కనగరాజ్)


