సీఎం విజయ్‌ నిర్ణయంపై విశాల్ తీవ్ర అభ్యంతరం..! | Actor Vishal question CM Vijay over giving film portfolio to Egmore MLA | Sakshi
Sakshi News home page

Vishal: సీఎం విజయ్ నిర్ణయంపై విశాల్ తీవ్ర ‍అసంతృప్తి..!

May 18 2026 7:04 AM | Updated on May 18 2026 8:51 AM

Actor Vishal question CM Vijay over giving film portfolio to Egmore MLA

విజయ్ సీఎం అ‍య్యాక అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. సీఎంవోలో ఓ జ్యోతిష్యుడిని నియమించడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే అతన్ని తొలగించారు. తాజాగా విజయ్ మరో నిర్ణయంపై హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫీ శాఖను ఎగ్మోర్ ఎమ్మెల్యే రాజ్‌మోహన్‌కు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం విజయ్‌కు సూచించారు.

సీఎం విజయ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నన్ను తీవ్రంగా నిరాశపర్చిందని విశాల్ అన్నారు. సినిమాతో విజయ్‌కు దశాబ్దాలుగా ఉన్న అనుబంధం కారణంగా.. ఈ శాఖకు న్యాయం చేయగలిగిన వ్యక్తి మీరేనని గుర్తు చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని.. సినీరంగ అభివృద్ధికి తక్షణమే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని అన్నారు.

చిత్ర పరిశ్రమ, సంఘాలు, నిర్మాణ సంస్థలకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడానికి పరిశ్రమలో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తి అవసరమని విశాల్ అన్నారు. ఈ విషయంలో తాను రాజ్‌మోహన్‌ను అవమానించే ఉద్దేశం తనకు లేదని.. సినిమా రంగంలో విజయ్‌కు ఉన్న అనుభవమే సరైన ఎంపిక అవుతుందని విశాల్ పేర్కొన్నారు. పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సమస్యలు పరిష్కరించే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నామని విశాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

విజయ్ ముందు డిమాండ్లు..

విశాల్ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు కీలక డిమాండ్లు ప్రతిపాదించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సినిమా టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇది ప్రేక్షకులపై భారాన్ని తగ్గించి, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తుందని అన్నారు. ఒకే దేశం-ఒకే పన్ను అనే సూత్రం ఉన్నప్పటికీ ద్వంద్వ పన్ను విధిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమేనని.. స్థానిక సంస్థల పన్నును తొలగించాలని కూడా ఆయన కోరారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఈ డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీలను పెంచాలని విశాల్ అభ్యర్థించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement