మాలల కోఆర్డినేషన్ ఫోరం నాయకులు
రామాయంపేట(మెదక్): విద్య, ఉద్యోగాల నియామకాల్లో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాలల కోఆర్డినేషన్ ఫోరం రాష్ట్ర నాయకులు శకుంతల, తిరుపతయ్య, శంకర్ ఆరోపించారు. మాలల జూయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించి రోస్టర్ పాయింట్లను 22 నుంచి 11కు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భర్తీ చేసిన ఉద్యోగాల్లో మాలలకు అన్యాయం జరిగిందని వాపోయారు. రోస్టర్ పాయింట్లు సవరించే వరకు ఉద్యోగ నియామకాలను, నోటిఫికేషన్ల జారీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2011లో మాలల జనాభా 15 లక్షలకుపైగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కుట్రతో 2024లో జరిగిన సర్వేలో 14 లక్షలకు తగ్గించిందని ఆరోపించారు. సమావేశంలో మాలల కోఆర్డినేషన్ ఫోరం జిల్లా ఇన్చార్జి జెల్ల సుధాకర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సంజీవ్, మాజీ ఎంపీపీ ఎల్లం, జిల్లా మాజీ అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం, చంద్రం, సురేందర్, రమేశ్ పాల్గొన్నారు.


