● రోడ్డు ప్రమాదాలకు బలవుతున్న వన్యప్రాణులు ● ఏడాదిలో రెండు చిరుతల మృతి
రామాయంపేట(మెదక్): అటవీ ప్రాంతాల పరిధిలోని రహదారులపై అండర్పాసుల నిర్మాణం విషయమై జరుగుతున్న జాప్యం వన్యప్రాణుల ప్రాణాల మీదికొస్తుంది. గతేడాది 44వ నంబర్ జాతీయ రహదారిపై నార్సింగి వద్ద అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. తాజాగా ఆదివారం మెదక్, ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ)పై గంగాపూర్ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో మరో చిరుత మృతి చెందింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. స్వయంగా అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. రోడ్డు ప్రమాదాల్లో వన్యప్రాణులు మృతి చెందుతుండటంతో గతంలో కేంద్ర అటవీశాఖ స్పందించి పలు సూచనలు చేసింది. ఇందులో భాగంగా జాతీయ రహదారులపై అటవీ ప్రాంతాల పరిధిలో అండర్పాసులు నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
55 కిలోమీటర్ల మేర హైవే..
జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారి మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, మాసాయిపేట, నార్సింగి, రామాయంపేట మండలాల మీదుగా 55 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారిలో 4 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. ఈ రహదారిపై వల్లూరు, రామాయంపేట వద్ద, మెదక్, ఎల్కతుర్తి 765 డీజీ జాతీయ రహదారిపై గంగాపూర్, తొనిగండ్ల, అక్కన్నపేట వద్ద అండర్పాసులు నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు సర్వే నిర్వహించిన ఆశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయినా ఇప్పటివరకు మంజూరు కాలేదు.
చిరుత కళేబరాన్ని పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు


