మెదక్ కలెక్టరేట్: జిల్లాలో శిశు మరణాలను అరికట్టాలని జిల్లా వైద్యాధికారి గణేశ్వర్ సంబంధిత అధికారులు, సిబ్బందిని అదేశించారు. గురువారం జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు నెలల్లో జిల్లాలో 7 శిశు మరణాలు జరగడంతో వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం, నెలలు నిండకుండానే పుట్టడం, కవలలు జన్మించడం తదితర కారణాలతో మరణించినట్లు తెలిపారు. అయినప్పటికీ వైద్య సిబ్బంది, సూపర్వైజర్లు ఆస్పత్రిలో చేరిన గర్భిణులను పరిశీలించి పూర్తి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టడానికి అవసరమైన అన్ని సూచనలు, సలహాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లా కేంద్ర ఆస్పత్రి, మాతా శిశు కేంద్రాల్లో తాగునీటి వసతులు, పారిశుద్ధ్యం తీవ్రంగా లోపించినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. తనిఖీల్లో సమస్యలున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఐఓ జయశ్రీ, మలేరియా అధికారిణి నవ్య, ఏఓ హరిప్రసాద్, మెడికల్ అధికారులు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ గణేశ్వర్


