వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రంలో కాకతీయ రాజులు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి చారిత్రక కట్టడాలను శనివారం పర్యాటక శాఖ కన్సల్టెంట్లు స్రవంతి గుప్తా, భువన్ సోమని పరిశీలించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సందర్శించినట్లు వారు చెప్పారు. ఈసందర్భంగా ప్రాచీన కట్టడాల చారిత్రక ప్రాధాన్యం, ప్రస్తుత పరిస్థితి, సంరక్షణ అవసరాలు, అభివృద్ధి అవకాశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఈ ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షించేలా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, వారసత్వ సంపద పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. పరిశీలన అనంతరం తమ నివేదికను రాష్ట్ర పర్యాటక శాఖకు సమర్పించనున్నట్లు వెల్లడించారు.


