మెదక్ అర్బన్ /పెద్దశంకరంపేట(మెదక్): ఎఫ్ఎల్ఎన్ యాప్ రూపకర్త, మెదక్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు బృంగి ప్రసన్నకుమార్ను సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ ఏ ఉషారాణి శుక్రవారం హైదరాబాద్లోని కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం అభివృద్ధికి కృత్రిమ మేథస్సు ఆధారంగా రూపొందించిన ఎఫ్ఎల్ఎన్ మొబైల్ యాప్ ఒక వినూత్నమన్నారు. విద్యార్థుల స్థాయి కనుగుణంగా కార్యకలాపాలు, ప్రశ్నలు, గేమ్స్ అందించే ఈ యాప్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, టీచర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎటువంటి కార్పొరేట్, వాణిజ్య సంస్థల సహకారం లేకుండా, సొంత ఆర్థిక వనరులతో , స్వీయ పరిశోధన ద్వారా యాప్ అభివృద్ధి చేశారని కొనియాడారు. ఇది ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఊతమిస్తుందన్నారు. బృంగి ప్రసన్నకుమార్ కృషిని డీఈఓ రాజు, ఏఎంఓ సుదర్శన మూర్తి, ఏఎస్ఓ నవీన్ కుమార్, టీచర్లు అభినందించారు.


