కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: స్వచ్ఛ మనందరి బాధ్యత అని, వ్యర్థాలు సక్రమంగా వేరుచేసి పరిశుభ్రమైన కలెక్టరేట్గా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై అన్నిశాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డీపీఓ యాదయ్య ఆధ్వర్యంలో 4రకాల డస్ట్బిన్లను అన్నిశాఖల అధికారులకు అందించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పక్కా ప్రణాళికతో అన్ని కార్యాలయాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం సర్ కార్యక్రమంపై ప్రకటన విడుదల చేశారు. భారత ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎవరు కూడా ఒకటికంటే ఎక్కువ జాబితాల్లో ఓటరుగా ఉండొద్దన్నారు. తప్పుడు సమాచారంతో ఓటరుగా నమోదు చేసుకుంటే ఏడాది జైలు శిక్ష, జరిమానా ఉంటాయని హెచ్చరించారు.
ప్రజావాణికి 66 వినతులు
అంతకు ముందు కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 66 అర్జీలు రాగా, అందులో భూ భారతి 24, ఇందిరమ్మ ఇళ్లు 12, పెన్షన్లు 3, ఇతర సమస్యలపై 27 దరఖాస్తులు వచ్చాయి. అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీపీఓ యాదయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


