నాలుగు అర్హత తేదీలు..
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
జిల్లాలో యువతకు మేలు
ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం మరింత పెంచే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ముందుస్తుగా (అడ్వాన్స్ అప్లికేషన్) ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించింది. అయితే 18 ఏళ్లు పూర్తయిన తర్వాతే వారి పేరు తుది ఓటరు జాబితాలో నమోదవుతుంది.
–నారాయణఖేడ్
గతంలో 18 ఏళ్లు పూర్తయ్యాకే ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రసుత్తం 17 ఏళ్లు నిండిన యువతీ యువకులు దరఖాస్తు సమర్పించవచ్చు. గతంలో జనవరి 1వ తేదీనాటికి 18 ఏళ్లు పూర్తి కాకపోతే యువత మరో ఏడాది పాటు వేచి ఉండాల్సి వచ్చేది. జనవరి 2న 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా నమోదయ్యేందుకు అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సంవత్సరానికి నాలుగు అర్హత తేదీలను అమలులోకి తెచ్చింది. ఈ నాలుగు తేదీల్లో ఏదో ఒక తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తి అయితే ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.
17 ఏళ్లు నిండిన యువతకు ఓటరుగా దరఖాస్తు చేసుకునేందకు నాలుగు అర్హత తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 అంటే ఏడాదిలో నాలుగు అవకాశాలు అందుబాటులో ఉండనున్నాయి. 18 ఏళ్లు నిండేందుకు కొద్ది నెలలకు ముందే ఫామ్–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 17 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలంటే అందుకు అవసరమైన ధ్రు వపత్రాలు సమర్పించాలి. బూత్స్థాయి అధికారి (బీఎల్వో)లు ధ్రువపత్రాల పరిశీలన జరిగిన తర్వాత ఓటు హక్కు ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయిస్తారు. కాగా 18 ఏళ్లు పూర్తయ్యాకే వారి పేరు జాబితాలో నమోదవుతుంది. ఇంటర్ ద్వితీయ, డిగ్రీ మొదటి సంవత్సరం చదివే వేలాదిమంది విద్యార్థులు 17 నుంచి 18 ఏళ్ల వయస్సులోకి వస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల కళాశాలల్లోనే ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఈ లెక్కన ప్రతీ యేటా యువత ముందుగానే దరఖాస్తు చేసుకుని అర్హత పొందడంతో ఓటర్ల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉంది.
ముందస్తు దరఖాస్తుకు నాలుగు అర్హత తేదీలు
18 ఏళ్లు నిండాకే ఓటు హక్కు
జిల్లాలో 23 వేల పైగా యువతకు అవకాశం
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో జిల్లాలో 23 వేల పైగా యువతకు అవకాశం ఏర్పడుతుంది. జిల్లాలో 2023– 24 విద్యా సంవత్సరంలో 22,012 మంది విద్యార్థులు పదోతరగతి విద్యనభ్యసించారు. ఇందులో 11,136 మంది బాలురు, 10,876 మంది బాలికలున్నారు. 2023– 24వ సంవత్సరంలో పరీక్షలు రాసే సమయానికి 15 ఏళ్లు నిండి ఉంటాయి. అంటే 2026 నాటికి 17 ఏళ్ల వయస్సు వస్తుంది. వీరితోపాటు 8, 9వ తరగతుల్లోనే మధ్యలో చదువు మానినవారు, ఇతరులు కలిపి 1,500 మంది వరకు ఉంటారు. ఈ లెక్కన సుమారు 23 వేలపైగా యువత కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.


