చిన్నశంకరంపేట(మెదక్): ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. దుబ్బాక నియోజవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నార్సింగి తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఎంపీపీ కార్యాలయ భవనం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే నూతనంగా ఏర్పాటైనా నార్సింగి, రాయపోల్, అక్బర్పేట–భూంపల్లి మండలాలకు నూతన భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గంలో 29 రహదారుల నెట్వర్క్ బలోపేతం కోసం హ్యామ్ ద్వారా ఆర్అండ్బీ రోడ్లకు రూ.137 కోట్లు, పంచాయతీరాజ్ (పీఆర్) రోడ్లకు రూ.67.95 కోట్లు కలిపి మొత్తం రూ. 204.95 కోట్లు విడుదలైనట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రహదారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిరంతరం పట్టుబట్టి నిధులను సాధించామన్నారు. ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్గత, లింకు రోడ్లను నిర్మిస్తామన్నారు. పనులు పూర్తయితే రవాణా ఇబ్బందులు తొలగి నియోజకవర్గ ముఖచిత్రం మారుతుందన్నారు. త్వరలోనే పనులకు శంకుస్థాపన చేసి నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
జహీరాబాద్: జహీరాబాద్ ఐసీడీఎస్ కేంద్రం పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులతో పాటు ఆయాలుగా పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ సుశీల తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో గల అన్ని ప్రాంతాల్లోని 15 అంగన్వాడీ టీచర్ పోస్టులకు, గిరిజన ప్రాంతాల్లో గల 20 ఆయాల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజావాణి, కార్యాలయంలో సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోమన్నారు. ఇతర వివరాలకు జహీరాబాద్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలో నిర్వహించనున్న కేవీపీఎస్ సామాజిక ఉద్యమ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి.అశోక్ విజ్ఞప్తి చేశారు. ఖేడ్ పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25, 26వ తేదీల్లో ఈ సామాజిక ఉద్యమ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేవీపీఎస్ కుల వివక్షత, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతుందని గుర్తు చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.శికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సింహులు, న్యాయవాది సుభాష్, సంతోశ్, జిల్లా సహాయ కార్యదర్శి గణపతి, సామాజిక ఉద్యమ నాయకులు కాన్షీరాం, ఇతర నాయకులు మోహన్, సురేశ్, బాబురావు, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రామాయంపేట(గజ్వేల్): రామాయంపేటలోని వెటర్నరీ ఆస్పత్రిలో సోమవారం జూనోసెస్ డే దినోత్సవం నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ తిరుపతి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. స్థానికులు తమ పెంపుడు జంతువులకు ఆస్పత్రులకు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్తో పెంపుడు జంతువులకు సంబంధించి రేబిస్ వ్యాధులను అరికట్టవచ్చన్నారు.


