నిర్లక్ష్యం చేస్తే గ్యాస్
సబ్సిడీ రద్దు
మెదక్ కలెక్టరేట్: ‘గ్యాస్ వినియోగదారులు ఈ– కేవైసీ చేసుకుంటేనే సబ్సిడీ వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే రద్దయ్యే అవకాశం ఉంటుంది’. అని గత కొన్ని నెలలుగా అధికారులు చెబుతూనే ఉన్నారు. అ యినా ఇప్పటివరకు వినియోగదారులు ఈకేవైసీ చేసుకోకపోవడం గమనార్హం. తెల్ల రేషన్కార్డు కలిగిన నిరుపేదలకు మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కేంద్రం సైతం ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులకు సబ్సిడీ అందజేస్తుంది. ఇందుకోసం ఆన్లైన్లో పూర్తి వివరాలు అందజేయాలని కొన్ని నెలలుగా ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. కొంతమంది సరిచేసుకోగా, ఇంకా కొంత మంది మిగిలిపోయినట్లు సమాచారం. వారి కోసం ఈనెలాఖరు వరకు అవకాశం కల్పించారు.
జిల్లాలో 3,84,373 కనెక్షన్లు
జిల్లావ్యాప్తంగా 3,84,373 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 52,047 ఉజ్వల వినియోగదారులు ఉన్నారు. జిల్లాలో 16 ఏజెన్సీల ద్వా రా గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం ఏడాదికి 8 సిలిండర్లు అందజేస్తుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులకు కేంద్రం సబ్సిడీ అందజేస్తుంది. ఈ పథకంలో ఇంకా 5,168 మంది లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది.
ఇదే విషయమై జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ను వివరణ కోరగా.. గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ చేసుకునేలా ఏజెన్సీలు ప్రోత్సహించాలన్నారు. లబ్ధిదారులకు సమాచారం అందజేసి వెంటనే అప్డేట్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు.


