● త్వరలోనే షెడ్యూల్ ● విలీన ప్రక్రియ కోసం మొదలైన చర్యలు
నారాయణఖేడ్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం మొదలైంది. మెదక్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ కార్మిక నాయకులు సైతం గుర్తింపు సంఘం ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీలో గుర్తింపు సంఘాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వంలో విలీనం తదితర ప్రధాన డిమాండ్లతో కార్మికులు ఇటీవల పెద్దఎత్తున ఆందోళన చేపట్టగా..కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చల అనంతరం సమ్మె విరమించిన విషయం విదితమే. ఇచ్చిన హామీమేరకు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో రిటర్నింగ్ అధికారిగా జంట నగరాల కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్దాస్ను నియమించింది. ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, పోలింగ్ తేదీలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి.
రీజియన్లో కదలిక..
ఎన్నికల్లో గెలుపొందిన సంఘంతో ప్రభుత్వం, కమిటీ చర్చలు జరిపిన తర్వాతనే ఆర్టీసీ విలీన ప్రక్రియ జరగనుంది. తమను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులు చేస్తున్న పోరాటం ఫలితంగా ప్రభుత్వం దిగిరావడం, విలీన ప్రక్రియకు ఎన్నికల నగారాకు ప్రభుత్వం సంసిద్ధమవుతుంది. కాగా, మెదక్ రీజియన్ పరిధిలో సైతం కార్మిక సంఘాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రీజియన్లో తెలంగాణ మజ్దూర్ యూనియర్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్),ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ప్రధాన యూనియన్లుగా ఉండగా వీటితోపాటు మరికొన్ని యూనియన్లు కూడా ఉన్నాయి. కొన్ని ప్రధాన యూనియన్లలోనే సభ్యత్వ నమోదు గతంలో అధికంగా జరిగేది.


