పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహరి
రామాయంపేట(మెదక్): మానవాళి మనుగడకు చెట్లే ప్రధానమని రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహరి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండలంలోని అక్కన్నపేట అటవీప్రాంతం నగర వనయోజన పార్కులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించి పలు పథకాల కింద విరివిగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. మెదక్ అటవీప్రాంతాన్ని టూరిస్ట్ హబ్గా రూపొందించాలన్నారు. జిల్లావ్యాప్తంగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారీకి ప్రణాళికలు రూపొందించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని కోరారు. అమ్మ ప్రేమ, త్యాగానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అటవీ సంపద సంరక్షణ, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల రక్షణ విషయమై విద్యార్థులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అంతకుముందు పార్కులో మొక్కలు నాటి అటవీ సంరక్షణ విషయమై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి జోజి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్, రోడ్డు భవనాలశాఖ ఈఈ వేణు, అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


