కలెక్టర్ రాహుల్రాజ్
కొల్చారం(నర్సాపూర్): రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం మండలంలోని వరిగుంతంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని హర్షం వ్యక్తం చేశారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 34 బాయిల్డ్ బిల్లులు 31 రా మిల్లులకు ధాన్యం కేటాయించామన్నారు. జిల్లా నుంచి సిద్దిపేటకు 10 వేల మెట్రిక్ టన్నులు, మహబూబ్నగర్ జిల్లాకు 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పంపించామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ధాన్యం తరలించేందుకు సుమారుగా 600కు పైగా లారీలు అందుబాటులో ఉన్నాయని, మరో 150 లారీల వరకు తెప్పిస్తున్నామన్నారు. తద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మారావు, తహసీల్దార్ గఫూర్మియా, కొలుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది, రైతులు ఉన్నారు.
పక్కా ప్రణాళికతో పనులు పూర్తి చేయాలి
అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఆయా పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తా, సంగాయిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన మరమ్మతులను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పాఠశాలలో చేపట్టిన పనులను నాణ్యతతో చేయించాలని, ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఎంపికై న 562 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఇప్పటివరకు అభివృద్ధి పనులు ప్రారంభమై 60 శాతం పూర్తయ్యాయని తెలిపారు.