● కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల ● జిల్లాల
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రెండేళ్లకుపైగా ఖాళీగా దర్శనమిస్తున్న పంచాయతీల ఖజానాలు ఒక్కసారిగా కళకళలాడుతున్నాయి. 2024 ఫిబ్రవరి 2తో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీలకు పాలకులు లేకపోవడంతో ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల నిధులు పూర్తిగా నిలిచిపోయి అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పంచాయతీల సాధారణ ఖర్చులు, కార్మికుల వేతనాలకు కూడా ఇబ్బందులు ఎదురుకావడంతో కార్యదర్శులు అప్పులు చేసి మరీ గట్టెక్కిస్తూ వస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగి గత డిసెంబర్ 22న పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల కింద జిల్లాకు మొదటి, రెండో విడతల్లో నిధులు విడుదల చేయడంతో 16 మండలాల్లో గల 306 గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యాయి.
ఆర్థిక సంఘం నిధుల విడుదల ఇలా..
2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు విడుతల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మొదటి విడత కింద రూ.8.61 కోట్ల నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.6.15 కోట్ల నిధులు జనాభా ప్రతిపాదికన ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.60 వేల నుంచి రూ.14 లక్షల వరకు జీపీల ఖాతాల్లో జమ అయినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్య పనులకు..
60 శాతం నిధులు పారిశుద్ధ్య పనులు, తాగునీటి అవసరాలకు వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. మిగిలిన నిధులను గత అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు, ఇతర బిల్లులు సక్రమంగా ఉన్న వాటికి కూడా వినియోగించేలా అవకాశం కల్పించారు. ఖర్చులు పోనూ ఇంకా మిగిలితే కొత్త పనులు చేపట్టేందుకు కూడా ఉపయోగించవచ్చు. అయితే కేంద్రం విడుదల చేసిన ఈ నిధులను మార్చి 31వ తేదీలోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు పాలకవర్గాలు ఈ నిధులను ఖర్చు చేస్తే త్వరలోనే మిగిలిన నిధులు కూడా మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
● కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల ● జిల్లాల


