మంత్రి పర్యటనకు హాజరుకాని అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ.. | - | Sakshi
Sakshi News home page

మంత్రి పర్యటనకు హాజరుకాని అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ..

Oct 9 2023 1:38 AM | Updated on Oct 9 2023 11:26 AM

- - Sakshi

పురాణం సతీశ్‌తో మాట్లాడుతున్న విప్‌, ఎంపీ

మంచిర్యాల : హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత ఆదివారం హైదరాబాద్‌లో కలిశారు. మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్‌ నాయకులు కూడా పురాణం సతీశ్‌కుమార్‌ను కలిశారు. రెండు పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్సీని కలవడం జిల్లా సోషల్‌ మీడియాలో పలురకాల చర్చ జరుగుతోంది.

అసంతృప్తిలో ‘పురాణం’
మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ కొంతకాలంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే టికెట్‌ దివాకర్‌రావుకు ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నూర్‌లో శనివారం మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన రోడ్‌షోకు హాజరుకాలేదు. దీంతో పురాణం పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

ఈ క్రమంలో ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత ఆదివారం హైదరాబాద్‌లో పురాణం ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్సీ అనారోగ్యంతో ఉన్నారని అందుకే పరామర్శకు వెళ్లారని కొంతమంది సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరికొందరు బుజ్జగింపులకే వెళ్లారని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కాంగ్రెస్‌లోకి ఆహ్వానం..
మరోవైపు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానం అందినట్లు తెలిసింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన కుమారుడు శ్రావణ్‌, కాంగ్రెస్‌ నేత దుర్గం నరేశ్‌, ప్రభాకర్‌ హైదరాబాద్‌లో పురాణం సతీశ్‌కుమార్‌ను కలిసినట్లు తెలిసింది. ఉదయం విప్‌, ఎంపీ కలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే ఓదెలు కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్న పురాణంను ఓదెలు కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యేను వివరణ కోరగా పురాణం సతీశ్‌కుమార్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ విషయమై పురాణం సతీశ్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement