అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం
పాన్గల్: వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక గడ్డి మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాన్గల్ మండలంలోని దావాజిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దావాజిపల్లికి చెందిన కావలి గట్టయ్య (51) తనకున్న అర ఎకరం పొలంతో పాటు 10 ఎకరాల వరకు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. పెట్టుబడి కోసం దాదాపుగా రూ.10 లక్షల వరకు గ్రామంలో అప్పులు చేశాడు. పంటలు సరిగా పండక, దిగుబడులు సక్రమంగా రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేదని తీవ్రంగా బాధపడుతూ ఉండేవాడు. దీంతో మనస్థాపంతో శనివారం వ్యవసాయ పొలంలో గడ్డి మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్లో వనపర్తి జిల్లా ఆస్పప్రతికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య బుడ్డమ్మ, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య బుడ్డమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని సర్పంచ్ సూగురమ్మ, ఉప సర్పంచ్ ప్రేమ్సాగర్, కాంగ్రెస్ నాయకులు కృష్ణయ్య, మాజీ సర్పంచ్ వెంకటయ్యయాదవ్, యుగంధర్గౌడ్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రైతు అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.


