సొమ్మంతా ఊడ్చుకెళ్లారు
జడ్చర్ల: పట్టణంలో కిరాణ దుకాణంలో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని పుస్తెల తాడును పట్టపగలే లాక్కెళ్లిన ఘటన జరిగిన గంటల వ్యవధిలోని పట్టణ శివారులోని మల్లెబోయిన్పల్లిలో తాళం వేసిన ఓ ఇంటిని దొంగలు గుల్ల చేశారు. బీరువాలో దాచిన సొమ్మంతా ఊడ్చుకుపోయారు. ఘటనకు సంబంధించి వివరాలు.. మండలంలోని మల్లెబోయిన్పల్లిలో కొమ్ము శ్రీనివాస్ ఇటీవల మరణించాడు. దీంతో దినవారాలు పూర్తయిన తర్వాత మృతుడి భార్య ధనలక్ష్మి, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి జడ్చర్లలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నిద్ర చేసేందుకు శుక్రవారం రాత్రి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున వారు ఇంటికి చేరుకునే సరికి గేటు, ఇంటి తలుపుల తాళాలు విరగ్గొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలో ఉంచిన 5 తులాల బంగారు నగలతో పాటు 70 తులాల వెండి నగలు, రూ.లక్ష నగదును దొంగలు చోరీ చేసినట్లు గుర్తించారు. దినవారాల సమయంలో ఒంటిపై నగలు ఉంచుకోకూడదన్న కారణంగా ఉన్న నగలు తీసి ఇంట్లో బీరువాలో దాచామని వారు వాపోయారు. విషయం తెలిసిన సీఐ కమలాకర్, ఎస్ఐ మల్లేష్ ఘటన స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
హడలెత్తిస్తున్న దొంగలు:
ఓ వైపు చైన్స్నాచర్స్, మరో వైపు దొంగలు ప్రజలను హడలెత్తిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రెచ్చిపోతుండడంతో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు దర్జాగా సంచరిస్తుండడంపై పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేయాలని, అనుమానస్పద వ్యక్తులపై ఆరా తీయాలని కోరుతున్నారు.
మల్లెబోయిన్పల్లిలో తాళం వేసిన ఇల్లు గుల్ల
బంగారం, వెండితో పాటు నగదు అపహరణ
కుటుంబ సభ్యులు గుడి వద్దకు
నిద్రకు వెళ్లిన సమయంలో చోరీ


