ప్రతి ఉద్యోగి హెల్మెట్ ధరించాలి
● జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
మహబూబ్నగర్ రూరల్: విధులకు వెళ్లే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను జాగ్రత్తగా నడపాలని జేఏసీ చైర్మన్, రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి సూచించారు. మహబూబ్నగర్ రూరల్ మండల జీపీఓ గోపాల్ వెళ్తున్న మోటర్ సైకిల్ను కలెక్టరేట్ ముఖద్వారం ఎదుట టిప్పర్ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో తక్షణమే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి న్యూరో శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం గోపాల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న లచ్చిరెడ్డి హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్కు వచ్చి గోపాల్ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స మంజూరు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర టీజీటీఏ ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక, ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు నర్రా శ్రీనివాస్, అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ దేవేందర్ కేసిరెడ్డి, ట్రెస్సా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య, టీజీటీఏ అధ్యక్షుడు ఘన్సీరామ్, ప్రధాన కార్యదర్శి నాణ్యనాయక్, శ్యామ్సుందర్రెడ్డి, జీపీఓ సంఘం నాయకులు లక్ష్మీ నరసింహ, పాండు పాల్గొన్నారు.


