అక్రమ కేసులతో అణచివేత
● ఎమ్మెల్యే ఆడించిన నాటకంలోనేఉప సర్పంచ్పై కేసు, జైలు
● బీజేపీ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధ్వజం
బల్మూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, వారి కనుసన్నల్లోని ఖాకీలు ప్రశ్నించిన వారిపై అణచివేతకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు. బీజేపీ ఉప సర్పంచ్ సీతారాంరెడ్డిపై అక్రమ హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు తరలించారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తు మండల కేంద్రంలో శనివారం నిరసన ర్యాలీతో పాటు అచ్చంపేట ప్రధాన రహదారిలోని పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బల్మూర్లోని రైతువేదిక ఎదురుగా ప్రభుత్వ భూమిలో యువతకు క్రీడా మైదానంతో పాటు రైతులకు పంట నూర్పిళ్లకు కేటాయించడం జరిగిందన్నారు. ఆ ఐదు ఎకరాల స్థలంలో ఇటీవల కాంగ్రెస్ కార్యకర్త కబ్జా చేసి నిర్మాణం చేస్తున్న విషయాన్ని ప్రశ్నించిన ఉపసర్పంచ్ ఈ విషయాన్ని తహసీల్దార్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, అప్పటికే అక్కడే ఉన్న మాజీ ఎంపీటీసీ అనుచిత వ్యాక్యలు చేయడంతో ఘర్షణ జరిగిందన్నారు. కానీ మాజీ ఎంపీటీసీపై దాడి చేశారని ఫిర్యాదు చేయాలని తహసీల్దార్తో ఎమ్మెల్యే వంశీకృష్ణ నాటకానికి తెరలేపారని ఆరోపించారు. రిజర్వాయర్ నిర్మాణంపై పోరాడుతున్నందునే సీతారాంరెడ్డిపై ఎమ్మెల్యే కక్ష్య సాధింపుగా అక్రమ కేసు పెట్టించారని మండిపడ్డారు. ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే జైలుకు తరలించడం హేయమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హత్యాయత్నం కేసు నమోదు చేయాలి..
పోలీసుస్టేషన్లో ఏఎస్ఐ, కానిస్టేబుళ్ల సాక్షిగా ఉప సర్పంచ్పై చెప్పులతో దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కుటుంబ సభ్యులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో పాటు వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని మాజీ ఎమ్మెల్యే బాలరాజు డీఎస్పీ శ్రీనివాసులును డిమాండ్ చేశారు. తాము నాయ్యం కోసం రాస్తారోకో చేస్తుంటే పోలీసులు హేళనంగా నవ్వడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం మాజీ సర్పంచ్పై దాడి చేసిన కూడా కేసు నమోదు చేయాలని ఎస్ఐని డీఎస్పీ ఆదేశించడంతో ఆందోళన విరమించారు.
ప్రధాన రహదారిపై ఉద్రిక్తత
బల్మూర్– అచ్చంపేట ప్రధాన రహరదారిపై వాహనాలు నిలిచి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొదటగా గ్రామంలో నిరసన ర్యాలీతో వచ్చిన బీజేపీ నాయకులు, రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగించారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు మంగ్యానాయక్, రాష్ట్ర నాయకులు బాలాజి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జానకి, బీఆర్ఎస్ నాయకులు సుధాకర్, తిరుపతి,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


