బాలికపై అత్యాచారం
● తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకులపై కేసు నమోదు
గద్వాల క్రైం: పాఠశాలకు తీసుకెళ్తానంటే తెలిసినవారే కదా అని బైక్ ఎక్కింది.. చివరికి ఆ నమ్మకమే ఆ బాలిక పాలిట శాపమై.. యువకుల చేతిలో అఘాయిత్యానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(15) జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్లేది. ఈ క్రమంలో గురువారం ఉదయం స్వగ్రామంలో బస్సు కోసం ఎదురుచూస్తుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైకుపై గద్వాలకు వెళ్తున్నాం.. పాఠశాలకు తీసుకెళ్తామంటే నమ్మి వారితో వెళ్లింది. ఈ క్రమంలో గద్వాల సమీపంలోని ఔటర్ రింగురోడ్డు మీదుగా వెళ్తుండగా బాలికకు అనుమానం వచ్చి కేకలు వేసింది. అనంతరం యువకులు బాలికను కొండపల్లి శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరింపులకు గురిచేసి పాఠశాల సమీపంలో వదిలేసి పరారయ్యారు. బాలిక పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు అత్యాచారం గురించి వెల్లడించింది. దీంతో వెంటనే వారు గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ శ్రీను సదరు యువకులపై పొక్సో, కిడ్నాప్, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం గాలిస్తోందని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థినికి వైద్య సదుపాయం అందిస్తున్నామన్నారు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.


