దక్షిణకాశీలో బ్రహ్మోత్సవాలు
అడ్డాకుల: మండలంలోని కందూర్ శివారులో స్వయంభుగా వెలసి ‘దక్షిణకాశీ’గా గుర్తింపు పొందిన రామలింగేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ నెల 28న మొదలయ్యే ఉత్సవాలు మార్చి 5 వరకు కొనసాగుతాయి. తర్వాత మొదలయ్యే జాతర మార్చి 27న జరిగే శ్రీరామ నవమితో ముగుస్తుంది. కాశీలో తప్ప మరెక్కడా లేని కల్పవృక్షాలు(కబంధ) కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం ఆవరణలో కొలవైనాయి. కాశీ తర్వాత కల్ప వృక్షాలు ఇక్కడే ఉన్నాయని పురాణం చెబుతోంది.
తంబళి వంశ మహిళతో..!
కందూర్ సమీపంలోని గుట్టపై పూర్వం రామలింగేశ్వరస్వామి ఆలయం ఉండేది. గుట్టపై కొలువైన రామలింగేశ్వరుడిని తంబళి వంశానికి చెందిన ఓ మహిళ ప్రతిరోజు గుట్టపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకునేది. కాలక్రమేణ ఆమె గర్భవతి కావడంతో రోజు గుట్ట ఎక్కడం చేతకాని పక్షంలో, ప్రతిరోజు గుట్ట ఎక్కి మిమ్ముల్ని దర్శించుకోవడం నా వల్ల కాదు.. మళ్లీ ఎప్పుడు దర్శించుకుంటానో ఏమోనని స్వామితో మొర పెట్టుకుంది. వెంటనే ప్రత్యక్షమైన రామలింగేశ్వరస్వామి నీవు రాలేకుంటే నేనే నీ వెంట వస్తాను.. వెనుదిరిగి చూడకుండా గుట్టదిగి వెళ్లు అని ఆమెతో చెప్పడంతో ఆమె గుట్ట దిగడం ఆరంభించింది. రథంపై రామలింగేశ్వరస్వామి గుట్ట దిగుతున్న సమయంలో రథచక్రాలు, గంటల శబ్ధాలకు ఆమె భయపడి వెనుదిరిగి చూసింది. దీంతో రథచక్రాలు విరిగి ఒకటికోనేరులో పడిపోయింది. రెండోది లింగాకృతిదాల్చిన రామలింగేశ్వరుని పీఠంగా ఏర్పడిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఆ మహిళ శిలగా రూపాంతరం చెందింది. ఆమె శిలావిగ్రహం నేటికి గర్భగుడిలో ఉంది. ప్రస్తుతం స్వామివారికి పానవట్టం లేదు. రథచక్రమే పానవట్టంగా మారడం క్షేత్ర మహిమ.
బ్రహ్మోత్సవాలకార్యక్రమాలు ఇలా..!
ఈ నెల 28న భూతబలి, యాగశాల ప్రవేశం, అంకురార్పణం, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణ ఉంటుంది.
మార్చి 1న పార్వతీసమేత శ్రీరామలింగేశ్వరస్వామి కల్యాణం
2న స్వామివారి ప్రభోత్సవం
3న అర్ధరాత్రి రథోత్సవం(తేరు)
4న గవ్యాన్తం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వృషభవాహన సేవ
5న రుద్రహోమం, మహాపూర్ణాహుతి, త్రిశులస్నానం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మరుసటి రోజు నుంచి మొదలయ్యే జాతర మార్చి 27న జరిగే శ్రీరామనవమి రోజున ముగుస్తుంది.
రేపటి నుంచి మొదలుకానున్నరామలింగేశ్వరస్వామి ఉత్సవాలు
మార్చి 1న కల్యాణం.. 3న రథోత్సవం
శ్రీరామ నవమి వరకు
కొనసాగనున్న జాతర
దక్షిణకాశీలో బ్రహ్మోత్సవాలు


