ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు
● ఒకే సమయంలో ఏడు చోట్ల తనిఖీలు
● ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు
● అక్రమాస్తులను గుర్తించే పనిలో ఏసీబీ అధికారులు
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం కంటే ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన ప్రభుత్వ అధికారులపై ఎక్కువగా దృష్టిపెట్టారు. గతంలో పనిచేసిన ప్రాంతాలతోపాటు ప్రస్తుతం పనిచేసే చోట నుంచి కూడా ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ఆదాయానికి మించిన ఆస్తులలో పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో పలు ప్రభుత్వ శాఖలలో అవినీతికి పాల్పడుతున్న అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టా ఎక్కడ బయటపడుతుందోనని కొందరు లోలోపల మదనపడుతున్నట్లు తెలుస్తోంది.
● డిసెంబర్ 4న మహబూబ్నగర్లోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కొట్టం శ్రీనివాసులు రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో పట్టుబడ్డాడు. దాదాపు రూ.వంద కోట్ల వరకు ఆస్తులు జప్తు చేశారు. డిసెంబర్ 23న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రవాణా శాఖ డీటీసీగా పని చేస్తున్న కిషన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడ్డాడు. తాజాగా కల్వకుర్తిగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్న కిరణ్కుమార్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏడు బృందాలుగా ఏర్పడి శనివారం ఒకే సమయంలో కల్వకుర్తి వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగుడులో సోదాలు నిర్వహించారు. మరో బృందం హైదరాబాద్లో కిరణ్కుమార్ ఇంటితోపాటు అతని బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు కిరణ్కుమార్ పేరిట ఉన్న భూములు, బ్యాంకు లాకర్స్, బంగారం, నగదు లావాదేవీలు, బ్యాంకు ఖాతాలపై తనిఖీలు చేశారు.
24నెలలుగా కల్వకుర్తిలో విధులు
వ్యవసాయ శాఖ ఏడీగా పనిచేస్తున్న కిరణ్కిమార్ రెండేళ్ల కింద సూర్యపేట నుంచి కల్వకుర్తికి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి విధులకు కూడా సక్రమంగా హాజరుకావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు అధికంగా రావడంతో శనివారం ఏసీబీ సీఐ జిలానీ ఆధ్వర్యంలో ఒక బృందం వ్యవసాయ శాఖ కార్యాలయంలోని ఏడీ చాంబర్లో ఉన్న కంప్యూటర్తోపాటు ఇతర ఫైల్స్, రికార్డులన్నింటినీ పరిశీలించారు. దాదాపు మూడు గంటల పాటు తనిఖీ చేసి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.


