మట్టివాసన నుంచి పుట్టిన క్రీడ కబడ్డీ
నారాయణపేట/మక్తల్: కబడ్డీ క్రీడ మట్టి వాసన నుంచి పుట్టిన క్రీడ అని, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు నైపుణ్యం ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని.. నేను చిన్నతనంలో ఇదే మట్టి మైదానంలో ఆడుకున్నా.. ఇప్పుడు క్రీడాశాఖ మంత్రిగా ఈ మైదానాన్ని అభివృది చేసే అవకాశం నాకు వచ్చింది. ఈ మక్తల్ మినీ స్టేడియం అభివృద్ధికి రూ.25కోట్లు మంజూరు చేశాం.. త్వరలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మక్తల్ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సీఎం కప్ సెకండ్ ఎడిషన్ కబడ్డీ పోటీలను మొదటగా సరస్వతి దేవి, హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ చిత్రపటాలకు పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడల జెండా ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి మంత్రి, కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కబడ్డీ పోటీలు శుక్రవారం ప్రారంభమై నాలుగురోజులపాటు అట్టహాసంగా కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ కబడ్డీ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి వచ్చిన 60జట్లు పోటీల్లో పాల్గొననున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ విజయకుమార్, జిల్లా స్పోర్ట్స్ అధికారులు హాజరయ్యారు.
● కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతి జిల్లాకు ఒక ఆటను ఎంపిక చేశారని, మన జిల్లాకు కబడ్డీని ఎంపిక చేయగా రాష్ట్రంలోనే ఇదే మొదటి ఈవెంట్ అన్నారు. సీఎం ఆశీస్సులతోనే రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం వచ్చిందన్నారు. అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారని, ఇలాంటి క్రీడల నిర్వహణతో వాటిపై యువకులు, ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు వచ్చిన క్రీడాకారులు, కోచ్లు, వ్యాయామ ఉపాధ్యాయులకు నాలుగు రోజులపాటు ఇక్కడే మహిళలు, పురుషులకు వేర్వేరుగా బస ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే అల్పాహారం, భోజనం, ఇతర వసతి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. మూడు రోజులపాటు క్రీడాకారులు ఆడే కబడ్డీ ఆటను చూసి మిగతా విద్యార్థులు నేర్చుకునే అవకాశం ఉందన్నారు.
● ఎస్పీ వినీత్కుమార్ మాట్లాడుతూ.. ఆటల్లో కబడ్డీ కల్చరల్ కింగ్ అన్నారు. దేశంలో కబడ్డీ ఆటకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. 4వేల ఏళ్ల చరిత్ర కబడ్డీకి ఉందన్నారు. దేశం ఇప్పటిదాకా కబడ్డీలో మూడుసార్లు ప్రపంచ కప్ సాధించిందని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి కలెక్టర్, ఎస్పీతో కలిసి గ్రౌండ్లోకి వెళ్లి క్రీడాకారులతో కబడ్డీ ఆడి లాంచనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్ మానస, వైస్ చైర్ పర్సన్ శైవిరెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ రాధా, డీఈఓ గోవిందరాజులు, డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి, బీజేపీ నేత కొండయ్య, కౌన్సిలర్లు, కోచ్లు, పీఈటీలు, క్రీడకారులు పాల్గొన్నారు.
నేను ఆడుకున్న మైదానాన్ని అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికిక్రీడాపాలసీ అమలు చేస్తాం
రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి
మట్టివాసన నుంచి పుట్టిన క్రీడ కబడ్డీ


