క్రీడలకు అత్యంత ప్రాధాన్యం
● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
● ఉత్సాహంగా సీఎం కప్ బాక్సింగ్, నెట్బాల్ పోటీలు
● వందలాదిగా హాజరైన క్రీడాకారులు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శుక్రవారం సీఎం కప్ రెండో ఎడిషన్ రాష్ట్రస్థాయి బాక్సింగ్, నెట్బాల్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు ఈనెల 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడలను ప్రారంభించారు. ముందుగా క్రీడాపతాకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. సీఎం స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడైనందున క్రీడల అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించడానికి సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 2036 ఒలింపిక్స్లో తెలంగాణకు బంగారు పతకం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
క్రీడల అభివృద్ధికి రూ.16 కోట్లు
జిల్లా కేంద్రంలో క్రీడల అభివృద్ధికి రూ.16కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇండోర్ స్టేడియంలో ఏసీ, అథ్లెటిక్స్ ట్రాక్, జిమ్లు, ఇతర క్రీడాసౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ మమత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనిత, కార్పొరేటర్లు ఉమేర్ కొత్వాల్, రమేశ్బాబు, డీవైఎస్ఓ శ్రీనివాస్, నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు విక్రమాదిత్యరెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి, బాక్సింగ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
బాక్సింగ్ పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి


