మహబూబాబాద్: జిల్లా నీటిపారుదల శాఖ ఎస్సీ కార్యాలయం పరిధిలో మూడు డివిజన్లు ఉన్నాయి. నాలుగు ఈఈ పోస్టులకు గానూ ఒక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే 90 శాతం ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల సాధారణ బదిలీలు జరిగాయి. కాగా, చాలామందిని బదిలీ చేసి.. కొన్ని పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. వీటితో పాటు చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో పరిపాలన పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో ఇరిగేషన్ శాఖ కీలకం. కాగా, వర్షాకాలంలో ఏర్పడే సమస్యలను అధిగమించడం సిబ్బందికి సాహసమనే చెప్పాలి.
డివిజన్ల పరిధిలో సబ్ డివిజన్లు..
ఎస్సీ కార్యాలయం పరిధిలో మూడు డివిజన్లు ఉన్నాయి. మానుకోట డివిజన్–8 పరిధిలో మానుకోట, గూడూరు, బయ్యారం, దంతాలపల్లి సబ్ డివిజన్లు ఉన్నాయి. మరిపెడ డివిజన్–9 పరిధిలో డోర్నకల్, కురవి సబ్ డివిజన్లు ఉన్నాయి. అలాగే డివిజన్–10 పరిధిలో కేసముద్రం, నెల్లికుదురు సబ్ డివిజన్లు ఉన్నాయి.
ఎస్సీ కార్యాలయంలో 28మంది సిబ్బంది..
ఒక్క ఎస్పీ కార్యాలయంలోనే ఆశించిన స్థాయిలో సిబ్బంది ఉన్నారు. 35మందికి 28మంది ఉన్నారు. ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక ఈఈ, రెండు ఏఈ, జేటీఓ, రెండు ఏటీఓ, ఒక టైపిస్టు పోస్టు ఖాళీగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.
డివిజన్ కార్యాలయాల్లో ఖాళీలు ఇలా..
మానుకోట డివిజన్–8 కార్యాలయంలో 24 మందికి 21మంది సిబ్బంది ఉన్నారు. ఒక ఈఈ, మూడు ఏటీఓ, ఒక టైపిస్టు పోస్టు ఖాళీగా ఉంది. డివిజన్–9 కార్యాలయంలో 27 మందికి 21 మంది ఉన్నారు. ఈఈ, ఏఈ, ఏటీఓ, జేటీఓ, టీఏ, టైపిస్టు ఇలా ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయి. డివిజన్–10 ఆఫీస్లో 54 మందికి 41 మంది ఉన్నారు. ఏఈ పోస్టులు ఐదు, టీఓ, ఏటీఓ, రెండు జేటీఓ, జేఏ, టైపిస్టు, అంటెండర్, లష్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
28మంది మాత్రమే..
ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో 74 మంది అర్హత ఉండగా.. 41మందికి స్థానచలనం కలిగింది. వారి స్థానంలో 28మంది మాత్రమే వచ్చారు. దీంతో సిబ్బందిపై అదనపు భారం పడుతోంది.
ఖాళీలపై ప్రభుత్వ విప్ ఆగ్రహం
ఈనెల 7న కలెక్టరేట్లో దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో నీటి పారుదలశాఖలో భారీగా ఏఈ పోస్టులు ఖాళీగా ఉంటే ఎందుకు తెలియజేయడం లేదని ఆశాఖ అధికారులపై ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీల వివరాలు ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భర్తీ చేస్తామన్నారు.
సబ్ డివిజన్ల పరిధిలో..
మానుకోట డివిజన్–8 పరిధిలోని మానుకోట సబ్ డివిజన్లో ఏడు పోస్టులకు ఐదుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. జేఏ, ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బయ్యారం సబ్ డివిజన్లో 7 పోస్టులకు ఏఈ పోస్టు ఖాళీగా ఉంది.
దంతాలపల్లి సబ్ డివిజన్లో 7 పోస్టులకు నలుగురు విధులు నిర్వర్తిస్తున్నారు.ఒక జేఏ పోస్టు, రెండు ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మరిపెడ డివిజన్–9 పరిధి డోర్నకల్ సబ్ డివిజన్లో 7 పోస్టులకు మూడు ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కురవి సబ్ డివిజన్లో 7 పోస్టులకు ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు ఏఈ పోస్టులు, ఒక జేఏ, ఒక అంటెండర్ పోస్టు ఖాళీగా ఉంది.
మరిపెడ సబ్ డివిజన్లో 7 పోస్టులకు ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు ఏఈ, ఒక జేఏ పోస్టు ఖాళీ ఉంది.
మరిపెడ డివిజన్ పరిధిలోని మరో సబ్ డివిజన్లో 7 పోస్టులకు ఒక టీఏ, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి.
నీటిపారుదల శాఖలో 90 శాతం ఏఈ పోస్టులు ఖాళీ
41మంది బదిలీ.. వచ్చింది 28మాత్రమే
నలుగురు ఈఈలకు ఒక్కరే విధులు


