● ఘనంగా ఆకుమల్లలో దేవర
● అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఊరేగిస్తున్న దృశ్యం
సంజామల: 16 ఏళ్ల తర్వాత ఆకుమల్లలో దేవర ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల కార్యక్రమం ఆదివారం ముగిసింది. శనివారం రాత్రి ప్రారంభమైన పెద్దమ్మతల్లి విగ్రహం ఊరేగింపు ఆదివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. కుమ్మరాం కట్ట వద్ద నుంచి ఊరువాకిలి పెద్దమ్మ గుడి వద్దకు మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. కులమతాలు అతీతంగా దేవర నిర్వహించారు. గ్రామంలో దాదాపు 1,100 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం బంధువులతో కళకళలాడింది. గ్రామం మొత్తం దాదాపు రూ. 4 కోట్లు ఖర్చు అయ్యింటుందని అంచనా వేస్తున్నారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్య ప్రకాష్రెడ్డి, అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, నాయకులు చల్లా విక్రాంత్ రెడ్డి, గౌరిగారి నాగేశ్వర్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఐ హనుమంత్ నాయక్, ఎస్ఐ రమణయ్య ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో భారీ పోలీస్ బందో బస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా చర్యలు తీసుకున్నారు.


