మహానంది: వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు ఆదివారం కావడంతో మహానంది ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో భక్తజన సంద్రంగా మారింది. రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, శీఘ్రదర్శనం, మహా మంగళ హారతుల ఆర్జిత సేవా టికెట్ల ద్వారా భక్తులు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లతో పాటు కోదండ రామాలయం, వినాయకనంది, ఆంజనేయస్వామి, గరుడనంది ఆలయాలను సందర్శించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా దర్శనం ఏర్పాటు చేశారు.
యువకుడి బలవన్మరణం
ఓర్వకల్లు: నన్నూరు గ్రామంలో ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మంగలి మద్దిలేటి కుమారుడు బజారు (26) ఇంట్లోనే ఉరేసుకుని మృతి చెందాడు. కొంతకాలంగా అతని మానసిక పరిస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.


