వ్యవసాయం రోజురోజుకు భారమవుతోంది. కష్టంతో పాటు ఖర్చు పెట్టిన ప్రతి పైసా తిరిగి రావాలని రైతులు దేవుడిపై భారం వేస్తారు. విత్తు మొదలు పంట అమ్మే వరకు ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ ముందకెళ్తారు. అన్నీ అనుకూలిస్తే గట్టెక్కుతారు.. లేదంటే నష్టాలు మూటగట్టుకుంటారు. కుటుంబమంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా ఒక్కోసారి మిగిలేది అప్పులే. అయినా రైతులు పట్టువదలని విక్రమార్కుల్లా వ్యవసాయం చేస్తూనే ఉంటారు. మద్దికెర మండలం పెరవలికి చెందిన రైతు రామాంజినేయులు తనకున్న మూడెకరాల తోటలో మిరప పంట సాగు చేశారు. బాడుగ ట్రాక్టర్తో పొలం దుక్కిదున్ని పంట సాగు చేశారు. పంటలో కలుపు తీసేందుకు కాడెద్దులు పెట్టాలంటే ఎక్కువ ఖర్చువుతుంది. ప్రతి చిన్న పనికి కాడెద్దులు పెడితే పంట నుంచి వచ్చే కాస్తో కూస్తో ఆదాయం కూడా మిగలకుండా పోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాడెద్దులు పోషణ భారమైంది. ఈ క్రమంలో ఇలా తన కొడుకు, కూతురు కాడెద్దులుగా మారగా తండ్రి దంతెతో మిరప పంటలో కలుపు తొలగించారు. – తుగ్గలి


