● విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమమని బంధువుల ఆరోపణ
కొలిమిగుండ్ల: చింత చిగురు కోసం వెళుతున్న ఓ వృద్ధురాలిని మృత్యువు విద్యుత్ రూపంలో బలితీసుకుంది. బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. అంకిరెడ్డిపల్లెకు చెందిన కాశింశెట్టి లక్ష్మీదేవి (63) కుమారుడు నాగేంద్రతో కలిసి ఉంటుంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో పనులు పూర్తి చేసు కొని సమీపంలో ఉన్న చింత చెట్ల వద్దకు చిగురు కోసుకునేందుకు వెళ్లింది. ఇటీవలనే గాలి వానకు విద్యుత్ స్తంభం తీగతో పాటు నేలకొరిగింది. చెట్టు వద్దకు వెళ్లే క్రమంలో తీగ తగలడంతో మంటలు వ్యాపించి అక్కడికక్కడే మృత్యువాత పడింది. కుమారుడు కూడా సిమెంట్ ఫ్యాక్టరీలోకి డ్యూటీకి వెళ్లాడు. శనివారం ఉదయం బంధువులు ఇంటి వద్దకు వచ్చి చూడగా కనిపించక పోవడంతో కుమారునికి సమాచారం ఇచ్చారు. డ్యూటీ నుంచి ఇంటికి చేరుకొని బంధువుల సాయంతో ఊర్లో అక్కడక్కడ వెతికారు. చుట్టు పక్కల గ్రామాల్లో ఆచూకీ కోసం వెతికినా కనిపించ లేదు. చివరకు విరిగిపడిన విద్యుత్ స్తంభం వద్ద పడి ఉన్న వృద్దురాలిని స్థానికులు చూసి లక్ష్మీదేవిగా గుర్తించారు. వారం, పది రోజుల క్రితం గాలి వానకు స్తంభం పడిపోయినా విద్యుత్ సిబ్బంది పట్టించుకోక పోవడంతో నిండు ప్రాణం బలైందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఇప్పుడు వృద్ధురాలి మృతికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.


