● జిల్లా గిరిజన సంక్షేమ అధికారి బి.సురేష్
కర్నూలు (అర్బన్): విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్న దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ/గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బి.సురేష్ ఆదేశించారు. శనివారం సాయంత్రం సంక్షేమ భవన్లోని తన కార్యాలయంలో గిరిజన విద్యాసంస్థలకు చెందిన ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాల్గో తరగతి సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా పాఠశాలలు, వసతి గృహాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే వంట పాత్రలు, తరగతి గదులు, డైనింగ్ హాల్స్ను కూడా శుభ్రం చేసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర వాటిపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులు పాఠశాలలకు వచ్చే నాటికి వారి అవసరాలకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు.


