కర్నూలు(అర్బన్): వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించాలని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయంతో పాటు బీసీ కార్పొరేషన్, కల్లూరులోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల్లోని రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సాధికరత అధికారిణి కె.ప్రసూన, బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుసేన్, సహాయ సంక్షేమ అధికారులు శ్రీనివాసులు, ఆంజినేయులు నాయక్, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షులు పాలేగార్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.


