● ఎస్పీని ఆశ్రయించిన బాధితులు
బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్లో మెడికల్ సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో దాదాపు 700 మంది నుంచి రూ. 7 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పద్మావతినగర్లో పట్టణానికి చెందిన ముల్లా ఇమ్రాన్, వెంకట మధుసాయి, విఘ్నేష్లు ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకున్నారు. సీఆర్ కాలింగ్ సంస్థ పేరుతో మెడికల్ సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీని ఏడాది క్రితం ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 700 మంది నిరుద్యోగులను చేర్చుకున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ వసూలు చేశారు. మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం మానేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బాధితులు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీని కలిసి తమగోడును చెప్పుకుని, కంపెనీ నిర్వాహకులకు తాము ఇచ్చిన నగదు ఇప్పించాలని కోరారు.


