● 15 రోజుల క్రితం కుమారుడి మృతి
కోసిగి: డి.బెళగల్ గ్రామానికి చెందిన గుడిసె లక్ష్మన్న(41) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మాధవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మన్నకు భార్య శారద, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడు గుడిసె నాని (12) అనారోగ్యంతో 15 రోజుల క్రితం మృతి చెందాడు. ఈ మేరకు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో నిద్ర చేసేందుకు బైక్పై బుధవారం సాయంత్రం లక్ష్మన్న బయలు దేరాడు. మార్గమధ్యలో మాధవరం బ్రిడ్జ్ సమీపంలో మంత్రాలయం నుంచి ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో లక్ష్మన్న తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ కోలుకోలేక గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు మాధవరం పోలీసులు కేసు నమోదు చేశారు. 15 రోజుల వ్యవధిలో ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


