కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మందుల కోసం రోగులు, సహాయకులు గంటల కొద్దీ నిలబడాల్సి వస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట అయినా మందులు ఇచ్చే షెడ్డును దాటి రోగులు క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కపోతను భరిస్తూ రేకుల షెడ్డు కింద జనం నరకయాతన అనుభవించారు. కౌంటర్ వద్దకు వెళ్లి మందులు తీసుకోవాలంటే కనీసం గంట సమయం పడుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతసేపు నిరీక్షించినా డాక్టర్ రాసిన మందులన్నీ ఇస్తారన్న గ్యారంటీ లేదు. చీటీలో రాసిన వాటిలో ఒకటి, రెండైనా మందులు ఇవ్వడం లేదని, వాటిని బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని, ఇన్సులిన్ మందులను సైతం నెలకు సరిపడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. – కర్నూలు(హాస్పిటల్)


