ఆదోని అర్బన్: మంచినీరు తాగాలంటే బిందెకు రూ.15 పెట్టి నీరు కొనాల్సిన పరిస్థితి ఆదోని మండలం పెద్దపెండేకల్ గ్రామస్తులది. బయట నుంచి వాహనంలో వచ్చిన మినరల్ వాటర్కూ డబ్బులిచ్చి పోటీపడాల్సిన పరిస్థితి. గ్రామంలో తాగునీటి సమస్య సంవత్సరం నుంచి తీవ్రంగా వేధిస్తోంది. నెల రోజుల క్రితం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని గ్రామస్తులు అడ్డుకొని బిందెలతో నిరసన తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. అయినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
ట్యాంకును శుభ్రపరచకుండా
దాదాపు సంవత్సరం నుంచి నీరు లేకుండా గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. సంవత్సరంపాటు వాటర్ ట్యాంకులో నీటిని వదలకుండా ఉండడంతో ట్యాంకులో చెత్తాచెదారం, క్రిములు, కీటకాలతో నిండిపోయింది. దాన్ని శుభ్రపరచకుండానే అధికారులు ఎమ్మెల్యే ఆదేశించారని నీటిని సరఫరా చేశారు. ఆ నీరంతా కలుషితం కావడంతో నీటిని వృథాగా బయటకు వదిలేశారు. ఇక మరుసటి రోజు నీరు వస్తాయనుకున్న గ్రామస్తులకు నీరు రాకపోవడంతో యథావిధిగా నీటి కొరత కొనసాగింది. దీంతో ఏమీ చేయలేక నీటిని కొనుగోలు చేసుకుని తాగుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపెండేకల్లో తీవ్ర నీటి ఎద్దడి
నెల రోజుల క్రితం ఎమ్మెల్యేకు
విన్నవించిన గ్రామస్తులు
అయినా పరిష్కారం కాని సమస్య
బిందె నీరు రూ.15కు కొంటున్న వైనం


