● ఆలూరు ఎమ్మెల్యే
బుసినే విరూపాక్షి
చిప్పగిరి: ఖరీఫ్ సమీపిస్తున్నా విత్తనాలు, ఎరువులపై స్పష్టమైన ప్రకటన రాకపోవడం రైతాంగాన్ని భయాందోళనకు గురి చేస్తోందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో గత రెండు సంవత్సరాలుగా రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం అని అన్నారు. రైతు సంక్షేమం విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ఎంతో తేడా ఉందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. పంట నష్టపోతే బీమా రావడం లేదని మండిపడ్డారు. ఈ ఏడాది యూరియా, ఎరువుల కోసం అనేక ఆంక్షలు విధించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా సీజన్ ముగిసే లోపు వచ్చేదని గుర్తు చేశారు. ఎల్నీనో ప్రభావానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు బుసినే చంద్రశేఖర్, శ్రీరాములు, వెంకటేష్, మహానంది, హనుమంతు, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.


